దేవుళ్లు రాజకీయాలు చేయరనే విషయం ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తనను దేవుడే పంపించాడని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె మరోసారి కౌంటర్ ఇచ్చారు. దేవుళ్లు రాజకీయాలు చేసి అల్లర్లు ప్రేరేపించరన్నారు.
దేశ ప్రయోజనాల కోసం తనను భగవంతుడు పంపించాడని మోదీ వ్యాఖ్యలు చేశారని… ఆయన తనను తాను మరో దేవుడిగా భావించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కానీ దేవుళ్లు రాజకీయాలు చేయరని పేర్కొన్నారు.
ఆయన కనుక తనను తాను దేవుడిగా భావించుకుంటే తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని… మోదీ గారికి ఒక దేవాలయం నిర్మిస్తానని… ప్రసాదంగా గుజరాత్ ప్రత్యేక వంటకం డోక్లా పెడతానన్నారు. మోదీ గారు దయచేసి ఆలయంలో కూర్చోవాలని… రోజూ పూజలు చేస్తామని చురక అంటించారు. ఇకనైనా దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.









