వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోమారు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తన బుజ్జగింపు వైఖరినే కాంగ్రెస్ తిరిగి అవలంభిస్తోందని అన్నారు. దేశ విభజనకు కారణమైన నాటి చారిత్రక తప్పిదాన్ని కాంగ్రెస్ పునరావృతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1937లో కూడా ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వందేమాతరాన్ని రెండుగా చీల్చిందని గుర్తుచేశారు. అక్కడే ద్విజాతి సిద్ధాంతానికి ఊపిరిలూది.. దేశ విభజనకు కాంగ్రెస్ పునాది వేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్రం కోసం పోరాడి అమరులైన వేలాది మంది త్యాగాలను ఆ ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ అవమానించిందని దుయ్యబట్టారు.
వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆనాడు చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, ఇతర బహిరంగ సభల్లో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలాపించడం తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్లమెంట్ చేసిన చట్టాన్ని పక్కనపెట్టి తమ 1937 నాటి పార్టీ తీర్మానానికే ప్రాధాన్యం ఇవ్వడం విచారకరమని షా అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ అలాంటి ఓటు బ్యాంక్ రాజకీయాలనే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలంతా ఏకమై ఖండించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
అంతకుముందు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తమ వేడుకలలో వందేమాతరం తొలి రెండు చరణాలు మాత్రమే పాడతామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. వందేమాతరంపై పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. 1937లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం బీజేపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. స్వాతంత్ర పోరాటంలో బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటో చెప్పాలని ఇటీవల ప్రశ్నించారు. అమిత్ షా పుట్టకముందే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని ఖర్గే ఘాటుగా విమర్శించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన తమ పార్టీని దేశద్రోహులని అనడం సరికాదన్నారు. అసలైన దేశద్రోహులు బీజేపీ నేతలేనంటూ ఖర్గే ఎదురుదాడికి దిగారు.








