AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలు.. రఘునందన్‌ సంచలన ఆరోపణలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అక్రమాలు

చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి లేఖ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందన్నారు. ఈ మేరకు రూ.30కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రలోభాల పర్వానికి తెరలేసినట్లు తెలిసింది. ఈ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పట్టభద్రుల ఓట్లను కొనుగోలు చేసేందుకు పార్టీలు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా.. బీఆర్‌ఎస్‌ పార్టీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్‌ఎస్‌ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రఘునందన్‌ రావు వేర్వేరుగా లేఖలు రాశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కెనరా బ్యాంక్‌లోని బీఆర్‌ఎస్‌ అధికారిక అకౌంట్‌ నుంచి 34 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు నగదు ట్రాన్స్‌ఫర్‌ జరిగినట్లు రఘునందన్‌ ఆరోపించారు.

ఈ మేరకు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతచేశారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే కోట్లాది రూపాయలను పట్టభద్రుల ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారని లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఖాతాలోని డబ్బును వెంటనే ఫ్రీజ్‌ చేసి విచారణ జరపాలని రఘునందన్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగు రాకేష్‌ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ANN TOP 10