AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్ మాటలు..మంత్రి కోమటిరెడ్డి ఫైర్

పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బంజరాహిల్స్‌లో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు తాము ఇచ్చామని కేటీఆర్ అంటున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారంటూ మండిపడ్డారు. మీ అయ్యా ఫామ్ హౌజ్‌లో పడుకుంటే నువ్వే కదా రాష్ట్రాన్ని పాలించావన్నారు. అధికారం చేపట్టగానే న్యాయ చిక్కులని తొలగించి ఉద్యోగాల భర్తీ చేపట్టమని గుర్తు చేశారు. దుర్గం చెరువు మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి.. అది ఇది చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు అంతో ఇంతో హైటెక్ సిటీ కడితే.. కాంగ్రెస్ పరిశ్రమలు తెచ్చిందన్నారు. మీ లెక్క తండ్రి పేరు చెప్పుకుని మా ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి రాలేదని ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలిచి ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి రేవంత్ రెడ్డి వచ్చారని తెలిపారు. ఒకరు ఆర్‌ఆర్ ట్యాక్స్ అంటున్నారని, మరోకరు యూ ట్యాక్స్ అంటున్నారని.. ఇక్కడ డబ్బులే లేవురా నాయనా అంటూ ఫైర్ అయ్యారు.

లోక్‌సభ ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ ఖతం..

లోక్‌సభ ఫలితాల్లో ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్‌కు డిపాజిట్ వస్తుందని, మిగతా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. కాంగ్రెస్‌కు 12కు పైగా స్థానాలు వస్తాయని, ఒక్క సీట్ కూడా రావడం లేదని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. మీ మిత్ర పక్షం మోడీతో మాట్లాడి ఐటీఐఆర్ ఎందుకు తేలేదు కేటీఆర్ అని నిలదీశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. అలాగే తాను మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళ్తున్నామని, అమెరికాలోని కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతామని చెప్పారు. టెట్ ఫీజు గురించి కేటీఆర్ బాధ పడుతున్నాడరని, కొందరు యువత ఉద్యోగాలు లేక అప్పులు తెచ్చుకుని వైన్స్ టెండర్లు వేశారన్నారు. వైన్స్ టెండర్‌కు రెండు లక్షల నాన్ రిఫండబుల్ డిపాజిట్‌కు పెట్టి.. రక్తం పీల్చుకున్నారని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ మూడు నెలల్లోనే ఇలా దిగజారిపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అవినీతి, అక్రమాల వల్లే పార్టీ కూలిపోతుందని, లోక్‌సభ ఫలితాల తర్వాత ఆ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. డిపాజిట్ రాని పార్టీలో ఎమ్మెల్యేలు ఎలా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ANN TOP 10