హైదరాబాద్: గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ పారిశుద్ద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన మొత్తం చెప్పింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కిషన్ను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు.
గాజులరామారం ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ స్పందించారు. మహిళ ఉద్యోగిని వేధించడాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్కు ఆదేశాలు జారీచేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఇప్పటికే కిషన్ను విధుల నుంచి తొలగించారు.
కుత్బుల్లాపూర్ పరిధిలో గల గాజులరామరం 25 సర్కిల్ పరిధిలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్గా కిషన్ పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే ఓ పారిశుద్ద్య కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్టు వినాలని, లేదంటే వేధింపులు తప్పవని బెదిరించాడు. ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆ తతంగాన్ని ఫోన్లో రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలు బయటకు రావడంతో కిషన్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలు చూసి ఇతర కార్మికులు ప్రశ్నించారు. ఎవరికి చెప్పొద్దని డబ్బు ఆశ చూపాడు. 14 మందికి తలా రూ.10 వేల చొప్పున ముట్ట జెప్పాడు. అయినప్పటికీ ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికే విధుల నుంచి తప్పించారు. పూర్తి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.