పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ ఏం చేశాడో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ జన జాతర సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. బీజేపీ వాళ్లు మాత్రమే దేవుడిని కొలుస్తారా?: అంటూ ప్రశ్నించారు. మన మందరం దేవునికి గుళ్లు కట్టామని, పూజలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని భరోసా కల్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామాందరమూ పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నింటినీ పక్కాగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ చూరగొంటున్నామన్నారు. బీజేపీ దేవుళ్ళ పేరు మీద ఓట్ల మార్కెటింగ్ చేస్తోందన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. నోరు తెరిచి అడిగినా ఆనాటి ప్రభుత్వం ఈ జిల్లాకు ఏమి కూడా ఇవ్వలేదని అన్నారు. అందుకే ఇనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆత్రం సుగుణను గెలిచిపించాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను కోరారు.









