ఢిల్లీ: సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.
ఏం జరిగిందంటే..?
రాందేవ్ బాబాకు చెందిన యోగ్ పీఠ్ ద్వారా యోగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. యోగా క్యాంపులకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. యోగా పేరుతో డబ్బులు వసూలు చేయడం ఆరోగ్యం, ఫిట్ నెస్ కిందకు వస్తోంది. సేవా విభాగం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుందని మీరట్కు చెందిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. 2006 మార్చి నుంచి 2011 వరకు నిర్వహించిన క్యాంపులతో రూ.4.5 కోట్ల సేవా పన్ను విధించింది. దీంతో రాందేవ్ బాబా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ తప్పలేదు. ఆ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
సేవా పన్ను
పతంజలి ట్రస్ట్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో యోగా క్యాంపులు నిర్వహించే వారు. ఆ శిబిరాల్లో పాల్గొన్న వారి నుంచి విరాళాల రూపంలో డబ్బు వసూలు చేశారు. అది సేవ కిందకు వస్తుందని, సేవా పన్ను చెల్లించాలిని కస్టమ్స్ ఎక్సైజ్ విభాగం అంటోంది. అది సేవా పన్ను కిందకు రాదని పతంజలి వాదిస్తోంది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో కూడా రాందేవ్ బాబా కంపెనీకి చుక్కెదురు అయ్యింది.