ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు.. అహ్మదాబాద్లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(punjab kings) అద్భుత విజయం సాధించింది. శశాంక్ సింగ్(61 నాటౌట్) అసమాన పోరాటానికి.. ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ(31) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడారు. శశాంక్, అశుతోష్లు సిక్సర్లతో హోరెత్తించి లక్ష్యాన్ని కరిగించారు. దాంతో, గుజరాత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.
ఆఖరి ఓవర్ పోరాటాలతో ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. గుజరాత్ను సొంత మైదానంలో చిత్తు చేసింది. దర్శన్ నల్కంద వేసిన 20వ ఓవర్లో పంజాబ్ విజయానికి 7 పరుగులు కావాలి. తొలి బంతిని లాంగాఫ్లో ఆడిన అశుతోష్ రషీద్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత బంతి వైడ్. మూడో బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతిని శశాంక్ బౌండరీకి తరలించాడు. రెండు బంతులకు ఒక్క రన్ అవసరమైంది. అప్పుడు లెగ్బై తీయడంతో పంజాబ్ సూపర్ విక్టరీ కొట్టింది.
70 పరుగులకే 4 వికెట్లు
భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్(1), జానీ బెయిర్స్టో(22), ప్రభ్సిమ్రాన్ సింగ్(35), సామ్ కరన్(5)లు విఫలమయ్యారు. ఆ దశలో సికిందర్ రజా(13), శశాంక్ సింగ్(25) హాఫ్ సెంచరీతో పోరాడుతున్నారు. రషీద్ ఖాన్ ఓవర్లో జితేశ్ శర్మ(16) వరుసగా రెండు సిక్సర్లు బాది పంజాబ్ను మరింత చేరువ చేశాడు. అయితే.. తర్వాతి బంతికే ఔటయ్యాడు. అక్కడితో అశుతోష్, శశాంక్లు సుడిగాలిలా చెలరేగి గుజరాత్ను ముంచారు.









