ఖమ్మం, భద్రాద్రిలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు
వచ్చే నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి
(అమ్మన్యూస్, ప్రతినిధి):
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రిలో అత్యధికంగా 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాయలసీమ, తెలంగాణ అంతటా వడగాల్పులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్న దృష్ట్యా అత్యవసరమైతే ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు రోళ్లు పగిలే ఎండలు ఉన్నాయన్నది నానుడి. కానీ ఈసారి మాత్రం ఏప్రిల్లోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. గతేడాది ఇదే సమయానికి గ్రేటర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా నగరం భగ.. భగమంటోంది.
నగరంలోని రాజేంద్రనగర్ ఏరియాలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. పటాన్చెరులో 40 డిగ్రీలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు ఎనర్జీ డ్రిరక్స్తో పాటు గొడుగు, కళ్ళకి గాగుల్స్, కాటన్ దుస్తులను వేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు. రాగల నాలుగైదు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.









