AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. నలుగురు మావోల మృత్యువాత

ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సలైట్లు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృత్యువాతపడ్డారు. భారీ సంఖ్యలో మావోయిస్టులకు ( Maoist ) గాయాలయ్యాయి. ఘటన జరిగినప్పటికీ పోలీసులు ఇంకా అడవిలోనే ఉండి మావోల కదలికలను పరిశీలిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తూ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఏకే 47 తుపాకీ లభ్యమైంది.

డీఆర్జీ, సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్, బస్తారియా బెటాలియన్, సీఏఎఫ్ సిబ్బంది మావో వ్యతిరేక ఆపరేషన్‌ కోసం అడవికి వెళ్లాయి. గంగులూరు ఏరియా కమిటీ నక్సలైట్లు వీరిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఇరువైపులా కాల్పులు జరపడంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత నలుగురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని గుర్తించారు. ఎన్‪కౌంటర్‌లో పోలీసు బలగాలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గంగలూరు కమిటీ దళానికి భారీ నష్టం వాటిల్లింది. కాగా ఎన్‪కౌంటర్‌పై పోలీసు అధికారులు అధికారక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ANN TOP 10