(అమ్మన్యూస్, హైదరాబాద్):
మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇంటికి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎందుకోసం చేరానన్నది కూడా చెప్పారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలంటే ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని.. అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. తన నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని అన్నారు.
కాగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కడియం శ్రీహరి కూతురు కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ నుంచి కడియం లేదా ఆయన కూతురు ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం.









