ఆదిలాబాద్ః ఆదిలాబాద్ నియోజవకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడంలేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు హస్తం గూటికి చేరుతున్నారు. ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకుంటున్నారు. వారందరినీ ఆయన సాదరంగా ఆహ్వానం పలికి రాబోయే ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తాజాగా పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో కోలిపుర, శాంతినగర్కు చెందిన కాలనీవాసులు, యువకులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరగా వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి స్వయంగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధారణ మహిళ, ఆదివాసీ ముద్దు బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆదిలాబాద్లో లక్షకుపైగా ఓట్లు సాధించాలనే లక్ష్యంతో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్కు డిపాజిట్లు దక్కకుండా చేయాలన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేసి చూడు అంటూ సవాల్ విసిరారు. అధికారం కట్టబెట్టిన ప్రజలే మిమ్మల్ని చెట్టుకు కట్టేసి కొడతారంటూ ఘాటుగా వ్యాఖ్యనించారు.తమది ప్రజా ప్రభుత్వమని, సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టి కాంగ్రెస్ను అధికారంలో కూర్చోబెట్టారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లోనే అమలుచేసిన ఘనత తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతోపాటు ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి బృహత్తర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు.
మంచి నాయకులందరినీ కాంగ్రెస్ ఆహ్వానిస్తోందని, అభివృద్ధి కోసం పాటుపడేవారిని అక్కున చేర్చుకుంటుందని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. వచ్చే ఎన్నికలేవైనా కాంగ్రెస్దే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి-వెంకట్రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాయిన్వార్ గంగారెడ్డి, పూసం ప్రభాకర్, పోతారెడ్డి, రుక్మారెడ్డి, మహ్మద్ రఫిక్, ఏంఎ. షకిల్, ఖయ్యూం, తమ్మలవార్ చందు, చారి, డోప్టాల శంకర్, చంటి, కుర్ర నరేష్, తదితరులు పాల్గొన్నారు.










