AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కశ్మీర్‌లో ఆసక్తికర పరిణామం..టాప్ టెర్రరిస్ట్ ఇంటిపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..!

జమ్మూ కశ్మీర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. భద్రతా దళాల మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు. షాపియాన్‌లోని వారి నివాసంపై తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అబిద్ రంజాన్ షేక్, లోయలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు. ముఖ్యంగా, కశ్మీర్‌లో పనిచేస్తున్న వలసేతర కార్మికులపై లక్షిత దాడులకు ఇతడే ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతటి కరుడుగట్టిన ఉగ్రవాది కుటుంబ సభ్యులు జాతీయ పతాకాన్ని ఎగరేయడం, మారుతున్న కశ్మీర్ పరిస్థితులకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలాంటి ఘటనే 2021లో కూడా చోటుచేసుకుంది. అప్పట్లో కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించి, ఎన్‌కౌంటర్‌లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ కూడా స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగరేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆయన, తోటి ఉపాధ్యాయులతో కలిసి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఇదిలా ఉంటే.. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లోక్ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ ఐక్యంగా ఉండి, పేదల పట్ల కరుణతో సమ్మిళిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. 2019 ఆగస్టులో రద్దు చేసిన రాష్ట్ర హోదా, ఇతర రాజ్యాంగపరమైన హామీలను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ANN TOP 10