తమపై దుర్మార్గపూరితంగా ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపారు. గతంలోనూ పలు ఛానెల్స్కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు సంబంధం లేని విషయాల్లో తమ పేరు, ఫొటోలను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్స్పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
తొమ్మిది మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం కేటీఆర్ నోటీసులు పంపారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనను, కుటుంబాన్ని బదనాం చేయాలని కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీవీ ఛానెల్స్ పాటు యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.
కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఛానెల్స్, మీడియా సంస్థలు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫొటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్నదన్నారు. ఈ ఛానెల్స్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.









