మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. 6 నెలల్లో మా ప్రభుత్వం కూలుతుందని కొందరు మాట్లాడుతున్నారు. మేం అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా..? మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే కాదు.. ఇటుకలు కూడా మిగలవు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో గత పదేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం. రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కడుపు కాలుతోందా? కళ్లు మండుతున్నాయా? ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని కవిత మాట్లాడుతున్నారు. మేం భర్తీ చేసిన 30వేల ఉద్యోగాల్లో 43శాతం ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలతో సహా పేర్లతో సహా చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేతనైతే మీ అయ్యను అసెంబ్లీకి పంపండి. లెక్కలు చెబుతాం.
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే అయ్యను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది. హరీశ్ రావు మేడిగడ్డకు రమ్మంటే రాడు. అసెంబ్లీలో మైక్ ఇస్తే చెప్పడు. పదేళ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను కూడా తీర్చలేకపోయారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి. భూముల విలువలు పెరగాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. 400 సీట్లు వస్తాయంటున్న మోదీ రాష్ట్రాల్లో పార్టీలతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు? ఎన్డీయేను అతుకుల బొంతగా ఎందుకు మారుస్తున్నారు? మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. మెట్రో మేడ్చల్ కు రావాలన్నా.. ఐటీ పరిశ్రమలు రావాలన్నా.. మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలుపుతోనే మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.