AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినీతి చిట్టా దొరికింది, ఏ ఒక్కరినీ వ‌దిలిపెట్టం.. మంత్రి జూప‌ల్లి స్ట్రాంగ్ వార్నింగ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతికి కాగ్ నివేదికనే ఆదర్శమని, అవినీతి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని మంత్రి జూపల్లి కృష్ణా రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో బీఆర్ఎస్ పాల‌న‌లో జ‌రిగిన అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌లన్ని వాస్తవమేనని తేలాయ‌ని.. ఇందుకు రాజ్యాంగ‌బ‌ద్దమైన సంస్థ కాగ్ ఇచ్చిన‌ నివేదికే నిద‌ర్శమ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం పాల‌న‌లో జ‌రిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహ‌ణ‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను కాగ్ ఎత్తిచూపిందని తెలిపారు. ప్రాజెక్టు ల‌క్ష్యాన్ని చేరుకోకపోగా.. ఖ‌జానాపై పెనుభారం మోపిందని కాగ్ ఆక్షేపించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపి, ఖర్చులేమో తక్కువ చూపారని.. కానీ వాస్తవంగా రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే మాత్రమేన‌ని కాగ్ స్పష్టం చేసిందన్నారు మంత్రి జూపల్లి. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ధరల పెరుగుదల వర్తింపు సహ పలు అంశాలను చూపకుండా ఆ తర్వాత పెంచారని కాగ్ పేర్కొన్న విష‌యాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా గుత్తేదారుల‌కు ప్రయోజనం చేకూరేలా వ్యవ‌హరించార‌ని మండిపడ్డారు.

గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో గోల్‌మాల్, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, ఆస‌రా పింఛన్ల పంపిణీలో అవ‌క‌త‌వ‌క‌లు, దుబారా ఖ‌ర్చులు.. స్థానిక సంస్థలు, రెవెన్యూ ఆదాయం వంటి అంశాలపై వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిన‌ట్లు కాగ్ నివేదిక బ‌హిర్గతం చేసింద‌ని ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుందని.. వంద‌ల కోట్ల అక్రమాలు జ‌రిగిన‌ట్లు కాగ్ నివేదిక బ‌హిర్గతం చేసింద‌న్నారు. గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో జ‌రిగిన అక్ర‌మాలు చూస్తే విస్తుపోయేలా ఉన్నాయ‌న్నారు. బైక్‌లు, కార్లు, అంబులెన్స్‌లు, ఆటోల్లో గొర్రెల‌ను త‌ర‌లించిన‌ట్లు కాగ్ నివేదిక పేర్కొందని తెలిపారు.

సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంట‌నే.. కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ విచార‌ణకు ఆదేశించింద‌ని, విచార‌ణ కోన‌సాగుతోంద‌న్నారు. మ‌రోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జ‌రిగిన వేల కోట్ల రూపాయాల కుంభ‌కోణంపై జ్యుడిషీయ‌ల్ విచార‌ణ జ‌రుపుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్రక‌టించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కాగ్‌ రిపోర్టు ఆధారంగా బీఆర్ఎస్ హ‌యంలో జ‌రిగిన వేలాది కోట్ల అవినీతి, అక్రమాల‌పై విచార‌ణ జ‌రుపుతామ‌ని.. త‌ప్పు చేసిన ఏ ఒక్కరినీ కూడా వ‌ద‌ల‌బోమ‌ని మంత్రి స్పష్టం చేశారు.

ANN TOP 10