AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగుల కల సాకారం చేయడంలో ముందడుగు పడిందని చెప్పారు. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ బోర్డు అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డ్ ప్రక్షాళన చేసి నూతన చైర్మన్‌ను నియమించామని పేర్కొన్నారు. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగాలు చేపడతామని చెప్పారు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను నింపుతామని, సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

తెలంగాణ పునర్నిర్మాణం కోసం కష్టపడుతామని అన్నారు. ఉద్యోగాలు ఇస్తుంటే.. బీఆర్ఎస్ నేతల కడుపు మండుతుందని విమర్శించారు. ప్రతి నిరుద్యోగి కల సాకారం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచించలేదన్నారు. ఉద్యోగాల కోసం ఉద్యమం బాట పట్టి.. నిరుద్యోగులు, విద్యార్థులు ముందు భాగాన నిలబడ్డారని గుర్తు చేశారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, పైగా వారిపై కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు.

ఇవాళ 7094 మందికి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలను అందజేశామని, సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్‌గా పనిచేశారని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేర్చ లేదన్నారు. కేసీఆర్ కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, కల్వకుంట్ల కవిత ఎంపీగా ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చారని విమర్శలు చేశారు.

ANN TOP 10