నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షురూ కానున్నాయి. నేడు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండగా.. ఫిబ్రవరి 9 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీల సభాపక్ష నేతలకు సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించే ఛాన్స్ ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనుంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు కానున్నాయి. దీంతో కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ నజర్ పెడుతున్నట్లు సమాచారం. అలాగే కీలక బిల్లులు గత సమావేశాల్లో ఆమోదం పొందాయి. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తోంది. కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లపై కూడా అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం అందుతోంది. ఏప్రిల్ నుంచి మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.