టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను చూసి ఆశ్చర్యపోయానంటూ కొనియాడారు. వివరాల్లోకి వెళితే.. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ట్రెండ్ను క్రియేట్ చేసుకున్న కోన వెంకట్ తాజాగా తన సొంత గ్రామంలో పర్యటించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. స్కూల్ అంతా కలియతిరిగారు. ఆధునిక వసతులు, సౌకర్యాలతో ఏర్పాటు చేసిన తరగతి గదులను పరిశీలించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ట్విట్టర్ వేదికగా స్కూల్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కోన వెంకట్ ‘నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలు నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ‘ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం కోన వెంకట్ షేర్ చేసిన ఫొటోలు, కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ‘జగనన్న సంక్షేమ పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం’ అంటూ వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.