AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాబోయ్‌ చలి.. హైదరాబాద్ సహా ఏడు జిల్లాల ప్రజలకు హెచ్చరికలు..

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కొద్దిరోజులుగా విపరీతమైన చలితో ఉదయం వేళల్లో బయటకురావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. ఇవాళ, రేపు చలితీవ్రత మరింత పెరగనుంది. దీంతో రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ఏడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తోపాటు అదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచుతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలను అతిజాగ్రత్తగా నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా, ప్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు. బయటకు వెళ్లకుండా వెచ్చటి ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే.. శనివారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, పలు జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లా సోనాలలో 10.7 డిగ్రీల సెల్సియస్, కుమురం భీం ఆసిఫా బాద్ జిల్లా సిర్పూర్ లో 11.2, నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో 11.7, నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లిలో 11.7, సంగారెడ్డి జిల్లా అల్మాయ్ పేటలో 12.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ANN TOP 10