ముంబై నగరంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ నగరంలోని పలు చోట్ల బాంబులు పేలుతాయని ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు. దాంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై అంతా విస్తృతంగా గాలింపు చేపట్టినా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతం ముంబై నగరం మొత్తం హై అలర్ట్లో ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్న ముంబై ప్రజలను ఈ వార్త వణికిస్తోంది. వివరాల ప్రకారం… ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కి శనివారం సాయంత్రం 6 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ ముంబైలోని పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పి.. కాల్ కట్ చేశాడు. దీంతో నగర పోలీసులు వేంటనే అప్రమత్తమయ్యారు. ముంబై అంతా విస్తృతంగా గాలింపు చేపట్టారు. పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల వేళ ముంబై మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐదు రోజుల క్రితం కూడా ఇలాంటి బాంబు బెదిరింపు ఒకటి వచ్చింది. ముంబైలోని ఆర్బీఐ ఆఫీసులు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 11 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ చేశారు. అప్రమత్తమయిన ముంబై పోలీసులు ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2024 న్యూఇయర్ వేడుకల సందర్భంగా మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.









