AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.500కు గ్యాస్‌ సిలిండర్.. ఆ కార్డు ఉన్నవారికే పథకం వర్తింపు!

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా.. లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోవాలనే నిబంధనను కూడా ప్రతిపాదించినట్లు సమాచారం.

ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలుచేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. రేషన్‌కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌కార్డుల సంఖ్య 89.98 లక్షలు కాగా… ‘గివ్‌ ఇట్‌ అప్‌’లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. అయితే రేషన్‌కార్డు డేటాబేస్‌తో మ్యాపింగ్‌ అయిన గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉన్నట్లు తెలిసింది. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. కొత్త రేషన్ కార్డులు పొందే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. అయితే కొత్త గ్యాస్‌ కనెక్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10