AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీ ఓటు ఎవరైనా వేసినా ఆందోళన అక్కర్లేదు.. ఇలా చేయండి చాలు..

పోలింగ్ రోజున ఓటర్లు గజిబిజీ గందరగోళానికి గురవుతుంటారు. ఒక్కోసారి ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం.. లేదంటే మరొకరు ఓటు వేసేయడం జరుగుతుంటుంది. ఓటింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లి తీరా ఓటు వేరొకరు వేసేశారంటే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అధికారులపై రుసరుసలాడుతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలి. ఓటు వేరొకరు వేసేస్తే.. ఇక వెనుదిరగాల్సిందేనా? లేదంటే మరొక చాన్సుంటుందా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఏ కారణాల చేతనైనా ఓటు హక్కు కోల్పోతే 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49 (పి) అవకాశం కల్పిస్తోంది. సెక్షన్ 49 (పి) ద్వారా ఓటు తిరిగి పొందవచ్చు. అయితే ముందు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తిని తానేనని అధికారి ముందు నిరూపించుకోవాలి. అందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎన్నారైలైతే పాస్‌పోర్టు చూపించాలి.

అటు తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17 (బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. అనంతరం టెండర్డ్ బ్యాలెట్ పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి మనకు ఇస్తారు. అటు తర్వాత మనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి తిరిగి అధికారికి పత్రాన్ని ఇచ్చేయాలి.

సెక్షన్ 49 (పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు అనుమతి ఇవ్వరు. కేవలం పోస్టల్ బ్యాలెట్‌కు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఓటేశాక.. దీనిని ఒక ప్రత్యేక కవర్‌లో ప్రిసైడింగ్ అధికారి భద్రపరుస్తారు.

ANN TOP 10