– పునాదుల నుంచి తొలగించాల్సిందే
– ప్లానింగ్, డిజైన్లో వైఫలం
– ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం
– నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం పై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ సంచలన నివేదిక బయట పెట్టింది. ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్లో వైఫల్యం వలనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారణకు వచ్చింది. బ్యారేజ్ వైఫల్యం కారణంగా ప్రజా జీవితానికి.. ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్యారేజ్ ను వినియోగించే అవకాశం లేదని నివేదకలో స్పష్టం చేసింది. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక ఇచ్చింది.
బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదని తేల్చేసింది. మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని అభిప్రాయపడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చిందని నివేదికలో స్పష్టం చేసింది.









