పెగాసస్ స్పైవేర్ వివాదం మరువకముందే దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపింది. గతంలో పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై మోదీ సర్కారు నిఘా పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. తాజాగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు యత్నించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్ అలర్ట్’ సందేశాలు రావడం సంచలనంగా మారింది.
‘ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్కు హ్యాకింగ్ ముప్పు ఉన్నది. మీ యాపిల్ ఐడీ ద్వారానే మీ ఫోన్ను టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని యాపిల్ భావిస్తున్నది. మీ ఫోన్లు హ్యాక్ అయితే సున్నితమైన డాటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉన్నది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్ తీసుకొంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావొచ్చు. అయినప్పనటికీ దీన్ని సీరియస్గా తీసుకోండి’ అని ఆ సందేశం సారాంశం. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
పలువురు ఎంపీలు, నేతలు తమ ఫోన్లకు వచ్చిన ఈ నోటిఫికేషన్ స్క్రీన్షాట్లను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నదని దుమ్మెత్తిపోశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ హ్యాకింగ్ అలర్ట్ సందేశాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
నకిలీ కూడా కావొచ్చు.. కానీ: యాపిల్
హ్యాకింగ్ అలర్ట్ వివాదంపై ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ స్పందించింది. కొన్ని యాపిల్ నోటిఫికేషన్లు నకిలీ కూడా కావొచ్చని పేర్కొన్నది. కొన్ని దాడులను గుర్తించలేం కూడా అని తెలిపింది. అయితే విపక్ష ఎంపీలకు హ్యాకింగ్ సందేశాలు ఎందుకు వచ్చాయన్నది మాత్రం చెప్పేందుకు యాపిల్ నిరాకరించింది. ‘ఈ అలర్ట్ నోటిఫికేషన్ జారీచేయడానికి గల కారణాలను మాత్రం మేం వెల్లడించలేం. ఎందుకంటే, దాన్ని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకొనే అవకాశముంది’ అని స్పష్టం చేసింది.
అలర్ట్ సందేశం వెళ్లిన వారిలో కొంతమంది..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓఎస్డీ, ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్ధ వరదరాజన్ తదితరుల ఫోన్లకు ఈ హ్యాకింగ్ అలర్ట్ సందేశం వచ్చింది.









