AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటినుంచి వన్డే ప్రపంచ కప్ షురూ..

ఐసిసి వన్డే ప్రపంచకప్‌ సంగ్రామం నేటినుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభానికి ముందు జరిపే వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) వెల్లడించింది. దీంతో గత వన్డే ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ జట్లయిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇక బుధవారం రాత్రి సంప్రదాయబద్ధంగా కెప్టెన్స్‌ డే ఈవెంట్‌ను నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ క్లబ్‌ హౌస్‌కు చెందిన బాంక్వెట్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 10జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌ తలపడనుంది. అహ్మాదాబాద్‌ వేదికగా ఆ మ్యాచ్‌ జరగనుంది.

ఇంగ్లండ్‌ జట్టు దుర్భేధ్యఫామ్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌ జట్టు గాయాలతో సతమతమౌతోంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీలు జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇద్దరూ ప్రస్తుతం గాయాలతో ఇబ్బందిపడుతున్నారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు మాత్రం మేటి బ్యాటర్లతో బలంగా కనిపిస్తోంది. బెన్‌ స్టోక్స్‌తో పాటు జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, జో రూట్‌, డేవిడ్‌ మలన్‌, హ్యారీ బ్రూక్‌ లాంటి హార్డ్‌ హిట్టర్లతో ఆ జట్టు బలీయంగా ఉంది. ఐపిఎల్‌లో ఆడిన అనుభవం వారికి అనుకూలించే అవకాశాలున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనలో ఇంగ్లండ్‌ బౌండరీల ఆధారంగా ట్రోఫీని తొలిసారి ముద్దాడింది.

ANN TOP 10