AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టూరిజంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష..!

హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటిలో సీఎస్ కె. రామకృష్ణారావుతో పాటు పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. మరోవైపు నగరంలో ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చాలని దిశానిర్దేశం చేశారు. అలాగే మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను అధునికీకరించాలని ఆదేశించారు.

 

మరోవైపు టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రధానంగా వికారాబాద్‌లోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి.. యాదగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటు క్యూర్ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలని చెప్పారు.

 

నగరంలోని పురానాపూల్ వంటి వారసత్వ సంపదగా నిలిచిన బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత అవసరమైతే ట్రాఫిక్‌ను మరో మార్గం నుంచి మళ్లించి.. పర్యాటకులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.

 

మరోవైపు పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి కూడా సీఎం సమీక్షించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అటు వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మంట్‌ సమ్మిట్‌పై ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించాలని చెప్పారు. ఈ సమ్మిట్ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ANN TOP 10