AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీజీ కేంద్రం నుంచి ఇక 24 గంటల సేవలు… సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై రియల్ టైమ్‌లోనే స్పందన ఉండాలని, ప్రభుత్వ సేవల్లో వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఐదు రోజుల జిల్లాల పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న ఆయన, సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీ) కేంద్రంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పురపాలక, పంచాయితీరాజ్, హోం, ఎక్సైజ్ వంటి కీలక శాఖల పనితీరు, ప్రజా సేవల్లో నాణ్యతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవలు అందించగలమని, పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన అన్నారు.

 

రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి ప్రజలకు వాస్తవ సమయంలోనే స్పందన అందాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ సముద్ర తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనను ఉదాహరణగా చూపుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వివిధ ప్రభుత్వ విభాగాలు ఎంత తక్షణమే సమన్వయంతో స్పందించాయన్నదే కీలకమని అన్నారు.

 

ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆధ్వర్యంలో తరచూ మల్టీ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ సమావేశాలు జరగాలని సూచించారు. ఆర్టీజీ కేంద్రం 24 గంటలూ ప్రజలకు సేవలందించేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.

 

“ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో ‘లాస్ట్ మైల్ గవర్నెన్స్’ ప్రజలకు అందాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్‌మెంట్, బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలి,” అని ముఖ్యమంత్రి విశ్లేషించారు.

 

పీజీఆర్ఎస్ పరిష్కారానికి యాక్షన్ ప్లాన్

పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు గట్టిగా ఆదేశించారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి, ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం చూపాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

పట్టణాల్లో ‘జీరో వేస్ట్’ లక్ష్యం

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రాబోయే మూడు నెలల్లోగా యుద్ధప్రాతిపదికన తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ‘జీరో వేస్ట్’ సాధించడమే మన లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బృహత్కార్యంలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై శ్రద్ధ పెట్టాలని కోరారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికీ చెత్త సేకరణ వంటి కార్యక్రమాలపై నిర్దిష్ట ప్రామాణిక కార్యాచరణ విధానం జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

 

గంజాయిపై ఉక్కుపాదం.. భద్రతకు పెద్దపీట

రాష్ట్రంలో గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలని, వాటిపై ఉక్కుపాదం మోపాలని హోం శాఖ అధికారులకు సీఎం నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం ‘డ్రగ్ ఫ్రీ కంట్రీ’ లక్ష్యంతో పనిచేస్తోందని, దానికి అనుగుణంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

 

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నామో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని, పాలనలో పొదుపు మంత్రాన్ని పాటించాలని అధికారులకు హితవు పలికారు. మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం టవర్లను ఏర్పాటు చేసేందుకు టెలికాం ఆపరేటర్లతో మాట్లాడి కార్యాచరణ చేపట్టాలన్నారు.

 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పురపాలక, ఎక్సైజ్, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ANN TOP 10