తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈసీఐ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు ఒక కోటి 58 లక్షల 71 వేల 493 మంది కాగా, మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్జెండర్ ఓటర్లు 2 వేల 557 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 15 వేల 338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 780 మంది ఉన్నారు. ఇదే కాకుండా ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా గత రెండేళ్ల కసరత్తుతో 22 లక్షల 2 వేల 168 మందిని ఓట్ల జాబితా నుంచి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
మొత్తం ఓటర్లు: 3,17,17,389
పురుష ఓటర్లు: 1,58,71,493
మహిళా ఓటర్లు: 1,58,43,339
ట్రాన్స్జెండర్లు: 2,557
సర్వీస్ ఓటర్లు: 15,338
ఓవర్సీస్ ఓటర్లు: 2,780
ఇదిలా ఉంటే తెలంగాణలోని పోలీసులు, ప్రభుత్వ విభాగాలపై తమకు నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికార బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రతి ఎన్నికల్లోనూ పని చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నాయకుల బృందం కోరింది. ఈ మేరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న సంఘటనలను కేంద్ర ఎన్నికల కమిషనర్ బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల విధులకు నియమించాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ వారు కోరారు.









