హాంగ్జౌలో టీమ్ ఇండియా షూటర్ల గురి తప్పటం లేదు. వరుసగా పతకాలు కొల్లగొడుతున్న మన షూటర్లు.. 2006 దోహా ఆసియా క్రీడల్లో నెలకొల్పిన 14 మెడల్స్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టారు. తెలంగాణ స్టార్ ఇషా సింగ్ రెండు మెడల్స్తో మెరువగా.. పాలక్ పసిడి సొంతం చేసుకుంది. మెన్స్ విభాగంలోనూ ప్రపంచ రికార్డుతో పసిడి పతకంతో పాటు మరో సిల్వర్ మెడల్ సొంతమైంది. టెన్నిస్లో వెండి, స్క్వాష్లో కాంస్యం సాధించిన టీమ్ ఇండియా.. ఓవరాల్గా 33 మెడల్స్తో పతకాల పట్టికలో నాల్గో స్థానానికి చేరుకుంది.
బుధవారం 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు విభాగంలో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో వెండి సాధించిన ఇషా సింగ్.. ఓ విరామం అనంతరం మరో రెండు పతకాలు కొల్లగొట్టింది. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో నాలుగు పతకాలు సాధించిన తొలి షూటర్గా ఇషా సింగ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన పోటీల్లో తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం జట్టు ఈవెంట్లో ఇషా సింగ్ సిల్వర్తో మెరిసింది. పాలక్, దివ్య సుబ్బరాజు జతగా జట్టు విభాగంలో ఇషా సింగ్ సత్తా చాటింది. పసిడి వేటలో ఇషా సింగ్ వరుసగా 95, 97, 95, 99, 97, 96 స్కోరు నమోదు చేసింది. పాలక్ 97, 97, 96, 95, 96, 96 స్కోర్లతో మెరువగా.. దివ్య సుబ్బరాజు 95, 97, 95, 99, 93, 96 స్కోర్లు సాధించింది. ఓవరాల్గా 1731 పాయింట్లు సాధించిన భారత్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 1736 పాయింట్లతో చైనా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకోగా.. చైనీస్ తైపీ 1723 పాయింట్లతో కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది.









