ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు భారత్ కు 30 పతకాలు సాధించింది. వీటిలో 8 స్వర్ణాలు, 11 రజతాలు,11 కాంస్య పతకాలు సాధించింది. దీంట్లో భాగంగా భారత్ మరో ఐదు పతకాలు సాధించింది. ఆసియా క్రీడోత్సవాల్లో తెలంగాణ ఆడబిడ్డ ఇషా సింగ్ వ్యక్తిగతంగా రజత పతకం సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ బిడ్డ ఇషాసింగ్ బృందం స్వర్ణ పతకం సాధించగా..ఇషా సింగ్ వ్యక్తిగతంగా రజత పతకం సాధించింది.
ఇషా సాధించిన ఈ ఘనతపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇషాసింగ్ తెలంగాణకు గర్వకారణం అంటూ ప్రశంసించారు. తెలంగాణ క్రీడాకారులు అందరికి తన హదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇషాసింగ్ బృందం 1759 పాయింట్లతో భారత్కు స్వర్ణ పతకం సాధించి..సత్తా చాటిందని..వ్యక్తిగత ఈవెంట్ లో కూడా రజతం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిస్తుందని క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. జాతీయ,అంతర్జాతీయ క్రీడా రంగాల్లో తెలంగాణ క్రీడాకారులు రాణిస్తున్నారని అదంతా వారి ప్రతిభేనని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.









