బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో చేరడం దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందుకు ఈనెల 27న ముహూర్తం కుదిరిందని మైనంపల్లి సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు.. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి తదితరులు వెళ్లారు. మైనంపల్లిని కాంగ్రెస్లోకి ఆహ్వానించనున్నారు.
ఇదే క్రమంలో మైనంపల్లి తో కొద్దిరోజులుగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సంప్రదింపులు జరుపుతున్నారు. తనకు మల్కాజిగిరితో పాటుగా తన కుమారునికి మెదక్ సీటునూ కేటాయించాలంటూ మైనంపల్లి ప్రతిపాదించారు. ఈ రెండు సీట్లలో సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మైనంపల్లి ప్రతిపాదనకు గ్రీ¯Œ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా మైనంపల్లి వెంట అధికార పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వెళ్తారని చెబుతున్నారు. మెదక్, ఇతర ప్రాంతాల్లోని కొందరు కౌన్సిలర్లు, సర్పంచ్లూ ఈ జాబితాలో ఉండే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మైనంపల్లి వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఉప్పల్ నియోజకవర్గంలోని ఓ కార్పొరేటర్ కూడా హనుమంతరావుకు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మైనంపల్లి వెంట వెళ్లకుండా పార్టీ అధినాయకత్వం నిలువరించే ప్రయత్నం చేస్తోంది.