హస్తినలో స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ భేటీలు
నేడు మరోసారి సమావేశం
లిస్టు ఫైనల్ చేసే అవకాశం
35 స్థానాల్లో సింగిల్ పేర్ల ఎంపిక
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు చివరి దశకు వచ్చింది. గురువారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ వార్ రూమ్ లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగింది. శుక్రవారం మరో సారి భేటీ కానుంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 35 నియోజకవర్గాల్లో సింగిల్ నేమ్ లను ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ డిసైడ్ చేసింది.
తొలి విడత జాబితాలో సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలకు స్థానం కల్పించారు. మరో 35 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నట్లు గుర్తించారు. మిగతా చోట్ల ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థుల పోటీ పడుతున్నారు. టికెట్ దక్కని నేతలకు వారి ప్రాధాన్యతలను బట్టి ఏఐసీసీ పెద్దలు నచ్చ చెప్పాలని నిర్ణయించారు. టికెట్ దక్కని వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక పలు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెలాఖరులోపు మొదటి విడత జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. అక్టోబర్ మొదటి వారంలో రెండో విడత, రెండో వారంలో మూడో విడత జాబితాను పూర్తి చేయాలని నిర్ణయం. మరోవైపు టికెట్ ల ఎంపిక తుది దశకు రావడంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణ నేతలు రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.