రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీడీప్ ద్వారా బహుమతులు అందిస్తామని టీఎస్ ఆర్టీసీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఎంజీబీఎస్లో రాఖీపౌర్ణమి రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిలో 33మంది మహిళలను లక్కీడీప్ ద్వారా విజేతలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బహుమతులు అందజేశారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి రోజున మూడు లక్షల మంది లక్కీడీప్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో ప్రయాణించిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్నరోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
దసరా, సంక్రాంతి, దీపావళి పండుగ సమయాల్లోకూడా స్పెషల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని సజ్జనార్ తెలిపారు. రాఖీ పండుగ నాడు ప్రయాణించిన ప్రయాణికుల్లో 33మందిని లక్కీ విజేతలుగా ఎంపిక కాబడ్డారని అన్నారు. రాఖీ పౌర్ణమినాడు ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చిందని, గతేడాది కంటే ఈ సారి పండగకు ఆదాయం వచ్చిందని తెలిపారు. 37 లక్షల కిలోమీటర్లు రాఖీ పండగరోజు ఆర్టీసి బస్సులు నడిచాయని అన్నారు. మొత్తం రాఖీ పండగ నాడు 3వేల బస్సులు నడిపామని, ఇది ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
పల్లె పల్లెలో ఆర్టీసి బస్సులు నడుస్తున్నాయని, కొత్తగా 1000 బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలోకి వచ్చాయని అన్నారు. మహిళలకోసం ఆర్టీసి హైదరాబాద్ లో ఉన్నాయని, కోటి, బోరబండ, మెహదిపట్నంలో రేపటి నుంచి మహిళల కోసం కొత్త బస్సులు అందుబాటులో ఉంటాయని ఎండీ సజ్జనార్ తెలిపారు. కొత్త బస్సులు కూడా నవంబర్ డిసెంబర్ కల్లా వస్తాయని అన్నారు.