భారత్ చరిత్ర సృష్టించడానికి ఇంకా మిగిలింది ఒకే ఒక్క అడుగు!. చారిత్రక క్షణాలకు ఇంకా కొన్ని గంటలే మిగిలాయ్!. చంద్రయాన్-3లో అత్యంత కీలక ఘట్టానికి దగ్గరైంది భారత్!. 41రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లికి చేరువైంది చంద్రయాన్-3. సుమారు 4లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై దిగేందుకు రెడీ అవుతోంది ల్యాండర్ విక్రమ్. బుధవారం సాయంత్రం 5:45కి ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానుంది..
జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి పంపిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా భగవంతుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.
భారీ సైకత శిల్పంతో.. ఆల్ ది బెస్ట్ ఇస్రో
ఒడిశాలోని పూరిలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. చంద్రయాన్-3కి తన కళతో ఆల్ ది బెస్ట్ తెలిపారు. పూరి సముద్ర తీరాన సుదర్శన్ బృందం.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించింది. జయహో ఇస్రో అంటూ ఇసుకతో చెక్కింది. ఈ సైకత శిల్పం.. పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తోంది.