స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం కేసీఆర్ పదేళ్ల పాలనకు నిదర్శనం అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు కురిపించారు. ‘గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుంది. అందుకే, ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అనే అహంకారంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్న సంగతి కేసీఆర్ ఏనాడో మరిచిపోయారంటూ షర్మిల ధ్వజమెత్తారు. ‘కేసీఆర్కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే, సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలి’ అంటూ ఆమె సవాల్ చేశారు.
‘స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి ఇదే సంకేతం. దొర గారు ఇన్నాళ్లూ గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే. దళిత బంధు అందకపాయే. ఇక దొర గజ్వేల్లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే’ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.