వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం (ఆగస్టు 17న) ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉందని చెప్పారు. దీని ప్రభావంతో నేడు, రేపు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమురంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రత్తమైంది. సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇక శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చేల్పూర్లో 7.95 సెం.మీ, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6 సెం.మీ, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 5.76 సెం.మీ. వర్షం కురిసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6 సెం.మీ, ఏటూరు నాగారంలో 5.1 సెం.మీ, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.









