కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో విషాదం చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పది రోజుల క్రితం గుండెపోటుకు గురై తమ్ముడు మృతి చెందగా.. పదో రోజు కార్యక్రమంలో అన్న కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే.. రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి, అరుణ దంపతులు. వీరికి ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30) ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26) ఇద్దరు కుమారులు. శ్రీకాంత్రెడ్డి కరీంనగర్లో ఒక ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. మధుసూధన్ రెడ్డి హైదరాబాద్లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈ నెల 3న ఛాతిలో నొప్పితో మధుసూదన్ అతడు ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరిన కాసేపటికే.. గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆ తర్వాత గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా… ఆదివారం మధుసూదన్ రెడ్డి చిన్న కర్మలు నిర్వహించారు. ఆ ఏర్పాట్లు పర్యవేక్షించిన శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లుండి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
అదే రోజు అతడిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం నిమ్స్ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో కుుటంబ సభ్యులు అతడిని నిమ్స్కు తరలించగా.. అక్కడి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయినా అతడి ఆరోగ్యం కుదటపడకపోగా.. పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం కన్నుమూశాడు. రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందొచ్చిన కొడుకులు ఇలా అకాల మరణం చెందటంతో గుండెలవిసేలా విలపించారు.









