హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చందానగర్ లోని గంగారం జేపీ సినిమాస్ లో మంటలు చేలరేగాయి. అయితే ఫైర్ ఆఫీసర్ గిరిధర్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తపాడియా మాల్లో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామన్నారు. మాల్లోని ఐదో ఫ్లోర్లో జేపీ సినిమాస్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, ఏడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసినట్లు తెలిపారు. మంటల తీవ్రత కేవలం లాబీలో మాత్రమే ఉందన్నారు. థియేటర్లోని స్క్రీన్లకు ఎలాంటి మంటలు అంటుకోలేదన్నారు.
కారిడార్లో ఉన్న ఫర్నిచర్, సోఫాలకు మాత్రమే మంటలు అంటుకున్నాయని చెప్పారు. క్యారిడార్లో ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ వల్ల మంటలు వ్యాపించినట్టు అనుమానిస్తున్నామని అన్నారు. కారిడార్లో చిప్స్, పాప్కార్న్ వంటి చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని.. వాటిలోని ఒక షాపులో మంటలు చెలరేగాయని తెలిపారు. థియేటర్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి ఉంటే తీవ్రత పెరిగేది కాదని చెప్పుకొచ్చారు. కారిడార్లో ఫైర్ జరుగుతుండడంతో ఫైర్ సేఫ్టీ ఎక్యుప్మెంట్స్ను ఆపేశారని ఫైర్ ఆఫీసర్ గిరిధర్ రెడ్డి వెల్లడించారు.