ప్రజా యుద్దనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. నేడు ఉదయం అల్వాల్ మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు జరపాలని కుటుంబసభ్యులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర నిర్వహిస్తారు. ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర జరగనుంది. అంతిమయాత్ర మధ్యలో గద్దర్ పార్థీవదేహాన్ని భూదేవినగర్లోని ఆయన నివాసంలో కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పలువురు ప్రముఖులు గద్దర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఎల్బీ స్టేడియంకు చేరుకుని గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు గద్దర్ పార్థివదేహానికి మంత్రులు మహమూద్ అలీ,సత్యవత్ రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంత్యక్రియలకు హాజరవుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు.