నేటి నుంచి నుంచి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తుంది. కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు.
ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చ జరిపేందుకు అనువుగా సభను ఎక్కువ రోజులపాటు కొనసాగించాలని సీఎల్పీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ ఎంతో నష్టపోయిందని, వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం చొరవ చూపలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, పరిహారం కోసం 500 కోట్లను మాత్రమే మంజూరు చేయడాన్ని హస్తం నేతలు తప్పుబడుతున్నారు. వరికి ఎకరానికి 20 వేలు పత్తికి,15 వేలు ఇతర వాణిజ్య పంటలకు 10 వేలు నష్టపరిహారం చెల్లించాలని.. ఇల్లు కూలిపోయిన వారికి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షలు, చనిపోయిన పశువులకు 65 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. వీటి పైనే ప్రభుత్వాన్ని నిలాదియాలని భావిస్తోంది. సహాయక చర్యల్లో సర్కార్ విఫలమైందని, అందుకే వర్షాలు, నష్టాలపై ఎక్కువగా చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు చివరివి కావడంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలు, అమలుపై చర్చ కోసం కాంగ్రెస్ పట్టుబడనుంది. అమలు కాని పంట రుణ మాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, ఉద్యోగాల భర్తీ, భూముల అమ్మకం, దళిత బంధు 30 శాతం కమిషన్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యూహ రచన చేస్తున్నారు.









