తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ వరకు పోస్టులవారీగా పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (ట్రిబ్) ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించింది. ఒకో పరీక్షకు రెండు గంటల సమయం చొప్పున ప్రతిరోజూ ఉదయం 8:30-10:30 గంటల వరకు, 12:30-2:30, 4:30-6:30 గంటల వరకు మొత్తంగా మూడు షిఫ్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభంకానుండగా, అనంతరం టీజీటీ, పీజీటీ, డీఎల్, జేఎల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా పరీక్షలను నిర్వహించనున్నారు. నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రిబ్ చర్యలు చేపట్టింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను నిర్వహించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలను రూపొందించామని ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరిగే పరీక్షల కోసం 17 జిల్లాల్లో 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.









