బండి సంజయ్కు కీలక పదవి అప్పగించిన బీజేపీ అధిష్టానం
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఏపీ బీజేపీ నేత సత్యకుమార్కు సైతం మరోసారి జాతీయ కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పదవికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. బండి సంజయ్ సేవలను వినియోగించుకోవడానికి కేంద్ర నాయకత్వం ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించడమో లేక జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ట్రాలకు బాధ్యులుగా పంపించే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న కారణంతో కేంద్ర మంత్రి పదవికి కిష¯Œ రెడ్డి రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా బండి సంజయ్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీకి మంచి ఊపు తీసుకొస్తారన్న టాక్ కార్యకర్తల్లో ఉంది.









