సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తనకు 69 ఏళ్లని.. ఫిబ్రవరి వస్తే 70 ఏళ్లు వస్తాయని అన్నారు. తాము కేవలం తోవ, దారి చూపించి పోతామని.. తెలంగాణ భవిష్యత్తు అంతా యువతదేనని చెప్పుకొచ్చారు. పాలించుకునేది మీరే.. నడిపించుకునేది మీరే.. అంటూ యువ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎవ్వరూ కూడా వెయ్యి ఏళ్లు బతకరని.. ఆరోగ్యం బాగున్నని రోజులు పని చేస్తామని.. కొంచెం అటూ ఇటూ అయితే అంతేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతిభవన్లో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వేళ.. కేసీఆర్ ఈ కామెంట్లు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తినెలకొంది. కేసీఆర్ ఇలా ఎందుకు అంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సీఎం బాధ్యతలు కేటీఆర్కు అప్పజెప్పి.. రెస్ట్ తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.
అధికారం వదిలేసుకుంటారా..?
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనే బీఆర్ఎస్ సర్కారు పాలసీ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని.. వాటిని తాను పట్టించుకోనన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలు, అన్నదాతల బాధలు తొలగిపోయి అందరూ బాగుండాలని కోరుకున్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణి అనే బృహత్తర కార్యక్రమాన్ని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని విపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.









