AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అల్లరి చేస్తుందని 16 నెలల చిన్నారిని.. గరిటెతో కొట్టి..

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్లరి చేస్తుందని 16 నెలల చిన్నారిని తల్లి గరిటెకొట్టడంతో మృతి చెందింది. జిల్లాలోని ఎలమంచిలికి చెందిన సాయితో గాజువాకకు చెందిన స్నేహకు 2020లో పెళ్లి జరిగింది. వీరికి సంతానంగా 2022 మార్చిలో పాప జన్మించింది. అయితే ఉపాధి కోసం భార్యాభర్తలు విజయవాడకు వెళ్లారు. కానీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విజయవాడ నుంచి ఇరువురు తమ సొంత గ్రామాలకు వెళ్లారు.

సాయి తన స్వస్థలమైన ఎలమంచిలికి వెళ్లగా.. స్నేహ గాజువాకకు తిరిగి వెళ్లింది. నెల క్రిందట కూర్మన్నపాలెం సమీపంలోని మంగళపాలెంలో ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లల్లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇదే సమయంలో దగ్గరి బంధువైన రమణబాబుతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. అయితే ఈ నెల 17న తన పాప గీతశ్రీ ఏడుస్తుండటంతో కోపంలో గరిటెతో తలపై కొట్టింది. దీంతో పాపకు గాయాలై కొద్దిసేపటికే మృతి చెందింది. ఏమి చేయాలో తెలియక రమణబాబుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది.

ఇద్దరూ కలిసి ఇంటి వెనుక భాగంలో గొయ్యి తీసి ఎవరికీ తెలియకుండా పాప డెడ్ బాడీని పూడ్చిబెట్టారు. కూతురుని చూడటానికి తండ్రి సాయి అప్పుడప్పుడు వస్తుండేవాడు. శనివారం కూతురిని చూసేందుకు సాయి వెళ్లగా.. పాప కనిపించలేదు. దీంతో భార్యను గట్టిగా నిలదీయగా డబ్బుల కోసం వేరేవారికి విక్రయించానంటూ నమ్మించే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో మట్టి కప్పేసి ఉంచిన పాప మృతదేహాన్ని కుక్కలు బయటకు లాగడంతో దుర్వాసన వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో స్థానికులు పరిశీలించగా.. చిన్నారి మృతదేహాం కనిపించింది. పోలీసులు దీనిపై సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చిన్నారి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తల్లిని పోలీసులు ప్రశ్నించగా.. గరిటెతో కొట్టడం వల్ల చనిపోయిన విషయాన్ని బయటపెట్టింది.

ANN TOP 10