కొత్తకోట దయాకర్ రెడ్డి మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మృతిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో సంతాపం ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యారు.
తన ఆప్తుడు దయాకర్ రెడ్డి అకాల మరణం తనను బాధించిందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. పాలమూరు జిల్లా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు.
రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ అంతలోపే దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో కాంగ్రెస్లో చేరికకు బ్రేక్ పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు.









