కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాద్కు రాబోతున్నారు. ఆయన చేవెళ్లలో బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. బహిరంగ సభలో పాల్గొనడానికి ముందు ఆయన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే బిజెపి నాయకులు సమావేశం కోసం జనాన్ని పోగుచేసే పనిలో పడ్డారు. బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో కొత్త వారు బిజెపి పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ వేదిక నుంచే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖం ఊదనున్నారని కూడా సమాచారం. కర్నాటక తర్వాత బిజెపి దృష్టి సారించిన రాష్ట్రం తెలంగాణయే! వచ్చే ఏడాది 119 నియోజకవర్గ సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(ఇదివరకటి తెలంగాణ రాష్ట్ర సమితి) 119లో 88 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. గతం కంటే 25 సీట్లు పెంచుకుంది. కాగా కాంగ్రెస్ 21 సీట్ల నుంచి 19కి కుంచించుకుపోయింది. మజ్లీస్ పార్టీ ఏడు సీట్లు గెలుచుకుంది. బిజెపి ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఒక్క సీటే గెలిచింది. దాని సీట్లు ఐదు నుంచి ఒక్కటికి కుదించుకుపోయాయి. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి బాగానే సీట్లు గెలుచుకుంది.









