తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలో లుకలుకలకు ఫుల్స్టాప్ పడడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ రంగం సిద్ధమైంది. కొండా సురేఖ స్థానంలో అలాంటి ఫైర్ బ్రాండ్ నేతను తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ఢిల్లీకి బయలు దేరినట్టు సమాచారం.
. ఈసారి మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగనున్నాయి. అందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈసారి కేబినెట్లోకి ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేఖ స్థానంలో మహిళకు మంత్రి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె పేరు దాదాపు ఖాయమైనట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీ. అప్పుడప్పుడు సమయం, సందర్భం బట్టి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగని పార్టీపై ఏనాడూ నోరు విప్పిన దాఖలాలు లేవు. ఆమెకి పదవి ఇస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్నట్లు టాక్.
హైకమాండ్తో విజయశాంతి మంతనాలు
కొండా సురేఖకు విజయశాంతి అతికినట్టుగా సరిపోతుందని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలంటే రాములమ్మకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదని అంటున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ పార్టీలో ఎంపీ గెలిచారు విజయశాంతి. ఆ పార్టీ గురించి ఎ టు జెడ్ ఆమెకి తెలిసినట్టు మరెవరికీ తెలీదని అంటున్నారు.
ఆమెకి మంత్రి పదవి ఇస్తే.. ప్రత్యర్థులను ఎదుర్కోవడంతోపాటు పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని అధిష్టానం లెక్కలు వేస్తోందట. కేబినెట్లోకి విప్ ఆది శ్రీనివాస్కు అవకాశం ఇవ్వాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. ఇద్దరు లేదా ముగ్గుర్ని కేబినెట్లోకి తీసుకుని, పలువురు సీనియర్లకు శాఖలు మార్పు చేయాలన్నది భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం.
ఈ విషయం తెలియగానే విజయశాంతి ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. ఈసారి విజయశాంతికు కేబినెట్ లో చోటు దక్కడం ఖాయమని అంటున్నాయి. హోం శాఖ కావాలని విజయశాంతి పట్టుబడుతున్నట్లు సమాచారం.








