ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ/గృహలక్ష్మి ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ధ్వజమెత్తారు. తాను రాకముందే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో ఖైరతాబాద్ లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వయంగా డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఆయన రాకముందే అధికారులు ప్రక్రియను ప్రారంభించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన దానం నాగేందర్ అధికారులపై మండిపడ్డారు.
ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా, ప్రోటోకాల్ పాటించకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారని దానం నిలదీశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నిరసనగా కార్యక్రమం మధ్యలోనే అలిగి వెనుదిరిగారు. కాగా, హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ఈ లక్కీ డ్రా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.








