AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

22ఏ భూముల సమస్యలపై పోరుబాట: బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాంచందర్ రావు కీలక భేటీ..

తెలంగాణలో ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతూ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇటీవల విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ విజయవంతంగా దీక్ష నిర్వహించిన బీజేపీ నాయకత్వం… తాజాగా రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలకు వ్యతిరేకంగా మరో రెండు ప్రధాన పోరాటాలకు సన్నద్ధమవుతోంది.

ఈ క్రమంలో నిషేధిత 22ఏ జాబితాలో చేర్చిన భూముల వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చే నెల (సెప్టెంబర్) 5, 6 తేదీల్లో బీజేపీ నేతలు భారీ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై చర్చించేందుకు ఈరోజు నిర్వహించిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

మరోవైపు, ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ లోని అసెంబ్లీ వరకు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ‘రైతు యాత్ర’ చేపడుతున్నారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది.

ANN TOP 10